కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆదివాసుల అభివృద్ధికై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివాసి ఆరాధ్యదైవం కొమరం భీమ్ 81 వ వర్ధంతి సందర్భంగా పోరుగడ్డ జోడేఘాట్ లో కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. ఆదివాసుల కై ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. జోడేఘాట్ లో ఆదివాసుల పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. పోడు భూముల సమస్య త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ,జియో 31 ఈ విషయంలో సీఎం కేసీఆర్ శాసనసభలో చర్చించారని అతి త్వరలో ఆదివాసులు సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎంపీ సోయం బాబూరావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , కొమరం భీమ్ మనుమడు సోనే రావు, ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడారు. కొమరం భీమ్ వారసులు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి , రాజేశం, ఐటీడీఏ పీవో భవేష్ మిశ్రా, ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల ,జిల్లా ఉన్నతాధికారులు , ఆదివాసులు తదితరులు పాల్గొన్నారు