న్యూఢిల్లీ నవంబర్ 20
కేబినెట్ ఆమోదం లేకుండాను వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిందంబరం మండిపడ్డారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం రద్దు చేస్తామన్నారు. ఈ క్రమంలో చిందంబరం స్పందించారు. హోంమంత్రి, రక్షణ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.ప్రధాని సాహసోపేతమైన చర్య తీసుకున్నారని హోంమంత్రి ప్రసంశించారని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని రక్షణ మంత్రి అన్నారని, ప్రధానికి రైతుల పట్ల అపారమైన శ్రద్ధ ఉందని బీజేపీ అధ్యక్షుడు అన్నారన్నారు. గడిచిన 15 నెలల్లో ఈ నేతలంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశం లేకుండానే ప్రధాని ఈ ప్రకటన చేసిన ఈ విషయాన్ని మీరు గుర్తించారా? అంటూ చిందంబరం ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం లేకుండా చట్టాలను రూపొందించడం బీజేపీ హయాంలోనే సాధ్యమన్నారు.