మందమర్రి. అక్టోబర్ 18
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలలో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతీరోజు బొగ్గు రవాణా చేస్తున్నామనీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సి. ఎం.డి. ఎన్. శ్రీధర్ సృష్టం చేశారు.
సోమవారం హైద్రాబాద్ కార్యాలయం నుండి ఆయన సంస్థ డైరెక్టర్లు, 11 ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి పెంపుదలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తెలంగాణాలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి బొగ్గు కొరత ఏర్పడకుండా బొగ్గు సరఫరా చేస్తున్నామనీ ఆయన అన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాలలో సరిపడినన్ని బొగ్గు నిల్వలు సమకూర్చామని, ఇకపై కూడా ఇదే విధంగా సింగరేణి నుండి బొగ్గు సరఫరా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రానివ్వబోమని సృష్టం చేశారు. అలాగే సింగరేణితో బొగ్గు సరఫరా ఒప్పందం గల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా తగినంత బొగ్గును అందిస్తున్నామనీ, రానున్న కాలంలో దీనిని మరింత పెంచుతామన్నారు.
గత 7 సంవత్సరాలుగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా సరిపడినన్ని బొగ్గు నిల్వలతో మంచి పి.ఎల్.ఎఫ్. సాధిస్తూ దేశంలోనే 6వ స్థానంలో నిలిచిందనీ, రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం తనవంతు పాత్రను సమర్థంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని భూగర్భ గనులు, ఓ.సి. గనుల నుండి లక్ష్యాల మేర బొగ్గు ఉత్పత్తి రవాణా చేయడానికి పకడ్భందీ చర్యలు తీసుకున్నామనీ, ఇకపై రోజుకి లక్షా 90 వేల టన్నుల బొగ్గు రవాణాకు సిద్ధమయ్యామనీ, నవంబర్ నెలనుండి రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. కేంద్రబొగ్గు మంత్రిత్వ శాఖ వారు నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇతర రాష్ట్రాలలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలియజేశారు.దేశంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున వీటిని అధిగమించడానికి ఒక ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణి నవంబర్ నెల నుండి రోజుకి 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాల్సిన అవసరం ఏర్పడిందని, దీని కోసం సర్వ సన్నద్ధం కావాలని సింగరేణీయులకు సింగరేణి సి.ఎం.డి. ఎన్. శ్రీధర్ పిలుపునిచ్చారు.