అమరావతి అక్టోబర్ 28
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ సమావేశాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ఆన్లైన్లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే యూనిట్కు రూ.2.49 చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోద ముద్రవేసింది. 2021 జనాభా గణనలో బీసీ జనాభాను కులాల వారీగా గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రతిపాదనకు, అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం చెప్పింది.
కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు, వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం వేసింది. రాష్ట్రంలో ఐదు చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు, పీపీపీ విధానంలో శిల్పారామం అభివృద్ధికి, విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందిన మంత్రి నాని తెలిపారు.
జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్కు, అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాల కేటాయింపునకు, శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాల కేటాయింపునకు, విజయవాడలో జేఎన్టీయూ కాకినాడ-గుజరాడ వర్సిటీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. అలాగే నవంబర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించగా.. ఇవాళ సాయంత్రం సీఎం వైఎస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో భేటీ కానున్నారు.