ఆసిఫాబాద్ అక్టోబర్29
జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్ లో శుక్రవారం అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా ప్రజలు అభివృద్ధి చెందాలని దీనికి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలన్నారు. జిల్లాలో ఎక్కువగా రైతులు ఒకే పంట పై ఆధారపడి జీవిస్తున్నారని పంట రుణాల విషయంలో బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చలేదన్నారు. పంట రుణం లక్ష్యాన్ని 90% ఖరీఫ్ లో చేరుకోవాలని నిర్దేశించినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు భవిష్యత్తులో బ్యాంకర్లు తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. అలాగే ప్రజల వద్ద ఆర్థికంగా ఎదుగుదల ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లాలో రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో ఎటువంటి ఇబ్బందులకు గురి చేసిన తాము బ్యాంకర్లకు అండగా ఉంటామని చెబుతున్నామని సిర్పూర్ లో అనేకమంది దగ్గరినుండి రుణం రికవరీ చేయడంలో సహాయపడటం జరిగిందని గుర్తు చేశారు. ఇళ్లలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని వారికి వివిధ రకాల రుణాలు అందించి ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలన్నారు. జిల్లాలో రుణం తీసుకొని రైతులు 40,000 మంది ఉన్నారని వీరికి ఇతర రకాల రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని తెలిపినప్పటికీ ఇప్పటివరకు కేవలం రెండు వేల మందికి మాత్రమే రుణం అందించారని అన్నారు. బ్యాంకర్లు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎన్ని సంవత్సరాలైనా జిల్లా అభివృద్ధి చెందదని అభివృద్ధి చెందిన జిల్లా గా మారడానికి బ్యాంకింగ్ సెక్టార్ ఎంతో ముఖ్యమైనది అన్నారు. జిల్లాలో మాల్ న్యూట్రిషన్ తగ్గించడం సాధ్యమైందని కానీ బ్యాంకింగ్ సెక్టార్ సరిచేయడం తమ వల్ల కావడం లేదని అన్నారు. రుణ వితరణ కార్యక్రమం మంచిదేనని అయితే ఇది కేవలం పేరు కోసం మాత్రమే చేయకూడదని చురకలంటించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన రంగాలకు రుణాలు అందజేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో ఇరిగేషన్ అభివృద్ధి కోసం విద్యుత్ సరఫరా కూడా చేశామని అయితే రైతులు బోర్వెల్ వేయడానికి రుణాల కోసం బ్యాంకు వస్తే తిరస్కరించకూడదని అన్నారు. జిల్లాలో వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, కాగజ్ నగర్ కేంద్రాలలో ఒక్కోచోట పాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని రైతులకు హైబ్రిడ్ పశువులు తీసుకురావాలని సూచించామని వారికి రుణాలు అందించాలన్నారు. హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్ కోసం హైదరాబాద్, మంచిర్యాల లాంటి ప్రాంతాలకు తయారీ వస్తువులు పంపించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో వచ్చే నెల 16 నుండి 31 తారీఖు వరకు హ్యాండ్ క్రాఫ్ట్ మేళా లో ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొంటున్నారని వీరికి బ్యాంకులు కొంత సాయం అందించడంతో ఇది సాధ్యమైందన్నారు. ఇలా జిల్లాలో పుట్టగొడుగుల సాగు, వెదురు సాగు తో పాటు, విద్యార్థులకు విద్యా రుణాలు అందజేయాలన్నారు దీనితో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆసిఫాబాద్ కాగజ్నగర్ స్వయం సహాయక సంఘాలకు బ్యాంకర్లు అందిస్తున్న రుణాలకు సంబంధించి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ కోవా హనుమంతరావు, ఎస్బిఐ నిజామాబాద్ డీజీఎం ప్రపుల్ల కుమార్, డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఆర్ ఎం శ్రీనివాస్ రెడ్డి ఏడిసిసి ఎజిఎమ్ అబయ్ కుమార్ అన్ని బ్యాంకుల అధికారులు, రుణ లబ్ధిదారులు పాల్గొన్నారు……