న్యూఢిల్లీ అక్టోబర్ 2
చైనా, పాకిస్తాన్ కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక బయటపెట్టింది.ఈ క్రమం లో చైనా సైన్యంలో పాక్ సైనిక అధికారుల రహస్యంగా మోహరించినట్లు తెలుస్తున్నది. సరిహద్దుల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కు సాయం చేయడానికి పాకిస్తాన్ అధికారులు చైనా సైన్యంతో కలుస్తున్నట్లు సమాచారం. భారత రక్షణ మంత్రిత్వ శాఖ, సైన్యం ఈ విషయాలపై నిశితంగా గమనిస్తున్నాయి. ఒక మీడియా నివేదిక ప్రకారం, పాకిస్తాన్ సైనిక అధికారులు చైనా సైన్యం పశ్చిమ, దక్షిణ కమాండ్లో నియమితులయ్యారు. పశ్చిమ కమాండ్ లడఖ్లో మోహరించగా, దక్షిణ కమాండ్ టిబెట్ ప్రాంతంలో ఉన్నది. పాకిస్తాన్ సైనిక అధికారులకు ఈ రెండు ప్రాంతాల కార్యాలయాల్లో పోస్టింగ్లు ఇచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీజింగ్లోని చైనా రాయబార కార్యాలయంలో దాదాపు 10 మంది పాకిస్థాన్ సైనిక అధికారులు కూడా నియమించబడినట్లు సమాచారం. వారికి వేరే పనులేవీ అప్పగించలేదని తెలుస్తున్నది. అయితే, చైనాలో ప్రస్తుతం ఎంతమంది పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారనేది స్పష్టంగా తెలియదు.ఒకవైపు సరిహద్దుల నుంచి దళాలను తొలగించడం గురించి మాట్లాడుతున్న చైనా.. మరొక వైపు లడఖ్లో సైనిక దళాల మోహరింపు, ఆయుధాల విస్తరణను పెంచుతున్నది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ధ్రువీకరించారు. చైనా, పాకిస్తాన్ చేష్టలను భారత విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తున్నది. ఎప్పుడు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత ఆర్మీ ప్రకటించింది.