నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు
నెల్లూరు జిల్లా పరిధిలోని బుచ్చి నగర పంచాయతీని అందంగా తీర్చిదిద్దేందుకు నేను, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కృషి చేస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుచ్చిలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చెప్పింది ఎన్నికల వాగ్దానం కాదని, బుచ్చి పై ఉండే అభిమానంతోనే నని చెప్పారు. బుచ్చిని నగరపంచాయతీ గా మార్చినందువల్ల అనేక లాభాలు కలుగుతాయని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేసినందున ,స్థానిక సమస్యలపై కొంత అవగాహన ఉందని తెలిపారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నెల్లూరు నుంచి బుచ్చికి సిమెంట్ రోడ్డు ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు బుచ్చి వ్యాపార కేంద్రంగా కూడా అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని కనీవినీ ఎరుగని రీతిలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య ,వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. బుచ్చి లోని 20 వార్డులలోనూ వైసీపీని గెలిపించాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు వీరి చలపతి రావు ,మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, జడ్పిటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.