కరీంనగర్
నవంబర్ 2న జరుగు హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఏర్పాటు చేయు కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ , పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ, ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ ముత్తు కృష్ణన్ శంకర్ నారాయణ, పోలీస్ అబ్జర్వర్ అనుపమ్ అగర్వాల్ లతో కలిసి పరిశీలించారు. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం వారు పరిశీలించారు. అక్టోబర్ 30న జరిగే ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వి వి ప్యాట్లు భద్ర పరచడంతో పాటు నవంబర్ 2వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కో సం కళాశాలలోని ఆడిటోరియం హాల్, తరగతి గదులు, ఇండోర్ స్టేడియంను వారు పరిశీలించారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ కు సూచించారు. కౌంటింగ్ కోసం తగిన ఫర్నిచర్, సీసీ కెమెరాలు, బారికేడ్లు, షామియానాలు, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల ముందు నుంచి జగిత్యాల వెళ్లే ప్రధాన రహదారిని కౌంటింగ్ రోజు ఒకపక్క మూసివేయాలని సూచించారు. కళాశాల ప్రాంగణంలోని మైదానాన్ని పరిశీలించారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, తహసిల్దార్లు , అధికారులు పాల్గొన్నారు.