జనగామ సెప్టెంబర్ 22
కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో మత్స్య శాఖ ద్వారా చేప పిల్లలు విడుదల చేసిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏడేండ్లలో అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు.దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయినప్పటి నుంచి నీటికి ఏ ఇబ్బంది లేకుండా ఉన్నామన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఎండాకాలంలోనూ నీరు అందించడం ముఖ్యమంత్రి కేసిఆర్తోనే సాధ్యమైందన్నారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, అయినా పేదల సంక్షేమ పధకాలు ఎక్కడా ఆపకుండా ఇస్తున్నామన్నారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.పేదలందరినీ అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లు పండించాలని ఆయన కోరారు. గూడూరు గ్రామంలో మాల కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నట్లు, కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ, 2021-22 సంవత్సరానికి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కింద జిల్లాలోని 786 చెరువులు, రిజర్వాయర్లలో 2 కోట్ల 82 లక్షల చేప పిల్లలు, వచ్చే నెలాఖరులోగా విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని 127 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 13 వేల 696 మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ పథకంతో చేపల స్వయం సమృద్ధి జరుగుతుందని, మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవో కృష్ణవేణి, డీపీవో రంగాచారి, పాలకుర్తి ఎంపీపీ నాగిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాసరావు, గూడూరు గ్రామ సర్పంచ్ కొమురయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.