ఖమ్మం సెప్టెంబర్ 28
ఖమ్మం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఐదుగురు యువకులు ఖమ్మం ఖిల్లా బజార్లో గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు బృందం, వన్ టౌన్ పోలీసులు కలిసి గంజాయి విక్రయిస్తున్న ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. నిందితుల దగ్గర 30 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం వన్ టౌన్ సీఐ చిట్టిబాబు తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న వారిలో ఖిల్లా బజార్కు చెందిన ఎండీ ముజామిల్స్(20), ఎండీ ముదాస్సీర్(21) కార్ డ్రైవర్తో పాటు రామన్నపేట గ్రామం, ఎన్టీఆర్ కాలనీకి చెందిన అంకిళ్ల సుమంత్(20) ఏసీ మెకానీక్, ఎండీ అఫ్రోజ్ (24) కార్ డ్రైవర్, మహాబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అంబేడ్కర్ నగర్కు చెందిన ఎస్డీ ఇబ్రహీంలు ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిందని తెలిపారు. నిందితుల నుంచి కారు, స్కూటీ స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదుచేసి న్యాయస్థానానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.