విశాఖపట్నం
ఏజెన్సీలోని మారుమూల గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల స్పష్టం చేశారు. మంగళవారం అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణతో కలిసి గుంటసీమ బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖమంత్రి వారి ఆదేశాలు జిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున సూచనల మేరకు ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో పివి టిజి గిరిజనులకు అందుబాటులో ఉండే విధంగా మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ -ఐటీడీఏ సంయుక్తంగా కొరవంగి ,పెదవలస, ఉప్ప, నిర్మతి గ్రామాలలో మెగావైద్య శిబిరాలు నిర్వహించామని చెప్పారు.వైద్య శిబిరాలను నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. మెగా వైద్య శిబిరం లో స్త్రీల వైద్యనిపుణులు, కంటి, చెవి,ముక్కు, జనరల్ వైద్యులు పాల్గొని వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆపరేషన్ అవసమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తామని చెప్పారు.
త్వరలో మన్యంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తామని దానికి అవసరమైన డేటా సేకరిస్తున్నామని పేర్కొన్నారు. పాడేరు లో రెడ్ క్రాస్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దానికి అవసరమైన భవనం కేటాయించామని తెలియజేసారు.