బెంగళూరు నవంబర్ 17
చంద్రుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2, నాసాకు చెందిన మూన్ ఆర్బిటర్ ఢీకునే ప్రమాదాన్ని ఇస్రో, నాసా నివారించాయి. చంద్రుడి చుట్టూ వేర్వేరు కక్ష్యల్లో పరిభ్రమిస్తున్న ఈ రెండు అంతరిక్ష నౌకలు అక్టోబర్ 20న భారత కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటలకు లూనార్ నార్త్ పోల్ వద్ద అత్యంత దగ్గరగా వస్తాయని వారం ముందుగానే అంచనా వేశాయి. ఈ సమయంలో చంద్రయాన్-2, మూన్ ఆర్బిటర్ మధ్య రేడియల్ విభజన దూరం వంద మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని, ఈ రెండూ అత్యంత దగ్గరగా చేరుకునే దూరం కేవలం మూడు కిలోమీటర్లే అని ఇస్రో, జేపీఎల్/నాసా గుర్తించాయి.ఈ నేపథ్యంలో చంద్రయాన్-2, మూన్ ఆర్బిటర్ ఢీ కు అవకాశమున్న క్లోజ్ అప్రోచ్ రిస్క్ను తగ్గించాలని ఇస్రో, నాసా నిర్ణయించాయి. చంద్రయాన్-2కు ఢీ నివారణ చర్యలు (క్యామ్) చేపట్టాలని పరస్పరం అంగీకరించాయి. దీంతో అక్టోబర్ 18న భారత కాలమానం ప్రకారం రాత్రి 8.22కు చంద్రయాన్-2 కక్ష్య గమనాన్ని ఇస్పో స్వల్పంగా మార్చింది. ఈ రెండు అంతరిక్ష నౌకల మధ్య తదుపరి దగ్గరి కలయికలో తగినంత పెద్ద రేడియల్ విభజన ఉండేలా క్యామ్ చర్యలు చేపట్టింది. దీని అనంతరం చంద్రయాన్-2, మూన్ ఆర్బిటర్ భవిష్యత్తులో అత్యంత సమీపానికి వచ్చే అవకాశం ఉండదని ఇస్రో తెలిపింది.