తిరుమల, అక్టోబర్ 04,
తిరుమల శ్రీవారికి అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అక్టోబరు 5వ తేదీ మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నారు.
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుధ్ధి నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
అక్టోబరు 5న విఐపి బ్రేక్ దర్శనాలు రద్ధు
శ్రీవారి ఆలయంలో అక్టోబరు 5వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్బంగా విఐపి బ్రేక్ దర్శనాలు రద్ధు చేయబడినది. అక్టోబరు 4న బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున విఐపిలు మరియు భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.