హైదరాబాద్
పత్తి విత్తనోత్పత్తి రైతుల సమస్యలపై కంపెనీలు, ఆర్గనైజర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తనోత్పత్తి రైతులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పత్తి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 35 వేల ఎకరాలలో పత్తి విత్తనోత్పత్తి జరుగుతున్నది. దేశంలో అవసరమయ్యే పత్తి విత్తనాలలో ఎక్కువగా మన రాష్ట్రం నుండి ఉత్పత్తి కావడం గర్వకారణం. పత్తి విత్తన రైతులకు నష్టం జరగకుండా, పత్తి విత్తనోత్పత్తి కంపెనీలు రాష్ట్రం నుండి తరలిపోకుండా రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీలు సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. చట్టప్రకారం ఉండాల్సిన నాణ్యత తగ్గకుండా చూసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. విత్తనోత్పత్తిలో జాతీయంగా, అంతర్జాతీయంగా మనకు ఉన్న ఖ్యాతి ఇనుమడించేలా ముందుకు సాగాలి. అన్నిరకాల విత్తనాల ఉత్పత్తికి తెలంగాణ ప్రాంత వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలమైనవి. పత్తి రైతుకు నాణ్యమైన విత్తనం అందించడమే లక్ష్యం. రాబోయేకాలంలో తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరగాలని అన్నారు.