హైదరాబాద్ అక్టోబర్ 18
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు అని ప్రశంసించారు. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, ఆనాడు విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇక్కడి ప్రజలు బాగుపడుతారని భావించి స్వరాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఎన్నో అన్నారు. ఎన్నో తిట్లు తిట్టారు. ముక్కు బాలేదని ఎవడికీ తోచింది వారు తిట్టారు. దేవుడు, ప్రజలు మన్నించారు. మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.అందరం పోరాడి దేశ రాజకీయ వాతావరణాన్ని మార్చాం. మాయావతి ఇంటికి 19 సార్లు పోయాము. మాయావతి తనను ఎంతో అభిమానించేది. మాయావతి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అలా ఇతర పార్టీల మద్దతును కూడగట్టాం. తెలంగాణ సాధనలో అనేక అటుపోట్లు ఎదుర్కొన్నాం. తెలంగాణ వచ్చినప్పుడు విపత్కరమైన పరిస్థితులు ఉండే. అనేకమైన బాధలు.. మంచి నీళ్లకు, కరెంట్కు ఇబ్బంది ఉండే. వ్యవసాయంలో దుర్భర పరిస్థితి. మొత్తానికి కిందమీద పడి, అన్ని అర్థం చేసుకుని పరిపాలన ప్రారంభించుకున్నాం. ఇప్పుడు గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి జరుగుతోంది. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. హైదరాబాద్లో ఉన్నోళ్లు గ్రామాలకు వెళ్లి బతుకుతున్నారు. ఇంకా చాలా జరగాల్సి ఉంది. వెనుకబడ్డ ప్రజలు, అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం చేకూర్చాలి. రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయి. చేనేత కార్మికులు బాగుపడుతున్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో సమస్యలు కొలిక్కి వస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. ఏ పని చేసిన అర్థం పరమార్థం ఉంటుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.