గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ వచ్చాయి. కానీ సమంత సన్నిహితుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం వారు ఇప్పటికే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ లో విడాకులకు అప్లయ్ చేశారట. కోర్టు నుండి ఆదేశాలు రావడమే తరువాయి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సమంతకు భరణంగా నాగార్జున ఫ్యామిలీ 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడిందని, ఆ ఆఫర్ ను సమంత సున్నితంగా తిరస్కరించిందనే పుకార్లూ వినిపించాయి. అయితే ఇవాళ నాగచైతన్య పోస్ట్ చేసిన ట్వీట్ ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసింది.
విడాకులపై పెదవి విప్పిన చైతు
విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నాగచైతన్య తెర దించేశాడు. శనివారం మధ్యాహ్నం నాగచైతన్య తన విడాకుల వార్త నిజమేనంటూ ట్వీట్ చేశాడు. భార్యాభర్తలుగా తమ బంధాన్ని ఇక మీదట కొనసాగించడం లేదని పేర్కొన్నాడు. దశాబ్దానికి పైగా తమ మధ్య ఏర్పడిన స్నేహబంధం గొప్పదని తెలిపాడు. మొత్తం మీద నాగచైతన్య తొలిసారి తమ విడాకుల గురించి మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు అయ్యింది. విశేషం ఏమంటే… నాగచైతన్య పెట్టిన ప్రెస్ నోట్ నే సమంత పేరు మార్చి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. సో… వీరిద్దరి మధ్య ఇప్పటి వరకూ అండర్ స్టాండింగ్ అయితే బాగానే ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ స్నేహబంధాన్ని ఇలానే కొనసాగిస్తారో లేదో చూడాలి.