తిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 23వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుధ్ధి నిర్వహిస్తారు.
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.