న్యూఢిల్లీ అక్టోబర్ 13
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేషన్ వేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. జాతీయ మాస్టర్ ప్లాన్ విధానంతో 21వ శతాబ్ధపు అభివృద్ధి ప్రణాళికలకు గతిశక్తి లభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విధానం ద్వారా అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో ముగుస్తాయన్నారు. గతంలో ఎక్కడకు వెళ్లినా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్న బోర్డులు కనిపించేవని, ఆ బోర్డులను చూసి ఈ పనులు ఎన్నడూ ముగియవని ప్రజలు అనుకునేవారని, ప్రజల్లో అపనమ్మకం పెరిగేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ప్రణాళికలను పకడ్బందీగా రూపొందించామని, అభివృద్ధి పనుల్లో గతిని తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాజకీయ పార్టీలు గతంలో ఎన్నడూ మౌళిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టలేదన్నారు. ఆ పార్టీల మ్యానిఫెస్టోల్లో అవి ఉండేదికాదన్నారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలన్నా.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నా.. ఉద్యోగ కల్పన చేయాలన్నా.. నాణ్యమైన మౌళిక సదుపాయాలు అవసరమని మోదీ అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఎగ్జిబిషన్ కాంప్లెక్స్ కొత్త మోడల్ను కూడా ప్రధాని సమీక్షించారు.