అమరావతి
ముఖ్యమంత్రి వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డు సమావేశంలో చర్చించారు. అనంతపురం జిల్లా పెనుగొండలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రంతో సహ పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఎస్ఐపీబీ ముందుకు వచ్చాయి. వాటికి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి. టూరిజం అంటే ఏపీ వైపే చూడాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలి. అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలి. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకొండని అన్నారు. ఆధునిక వసతలు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్ధాయి పెరుగుతుంది. పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడేవారికి మెరుగైన అవకాశాలు వస్తాయి. తద్వారా ఉద్యోగాల కల్పన, ఉపాధి పెరుగుతాయి. విశాఖపట్నంలో లండన్ ఐ తరహా ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, జీఏడీ స్పెషల్ సీఎస్ కె ప్రవీణ్ కుమార్, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి జి విజయ్కుమార్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పరిశ్రమలశాఖ డైరెక్టర్ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.