తిరుమల,మా ప్రతినిధి ,అక్టోబర్ 01,
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 11న గరుడసేవ నాడు ముఖ్యమంత్రి గౌ. శ్రీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి తెలిపారు. అదే రోజు ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లతోపాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో వెల్లడించిన వివరాలు ఇవి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు :
– శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నాం. అక్టోబరు 5న కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, అక్టోబరు 6న అంకురార్పణ, అక్టోబరు 7న ధ్వజారోహణం, అక్టోబరు 11న గరుడవాహనం, అక్టోబరు 12న సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం, అక్టోబరు 14న ఉదయం రథోత్సవానికి బదులుగా సర్వభూపాలవాహనం, అక్టోబరు 15 ఉదయం చక్రస్నానం (అయిన మహల్లో) – రాత్రి ధ్వజావరోహణం, అక్టోబరు 16న శ్రీవారి భాగ్సవారీ ఉత్సవం జరుగనున్నాయి.
ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభోత్సవాలు
– అక్టోబరు 11న గరుడసేవ నాడు ముఖ్యమంత్రి గౌ. శ్రీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదే రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
– అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత శ్రీ శేఖర్రెడ్డి విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
– అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి పైకప్పును రిలయన్స్ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో పునఃనిర్మించిన మార్గాన్ని రాబోయే బ్రహ్మోత్సవాలలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం.
– తిరుమలలో ఇండియా సిమెంట్స్ రూ.12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటును అందుబాటులోకి తీసుకువస్తాం.
– ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చిన్నపిల్లల కోసం తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి పాత బ్లాక్లో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి తాత్కాలిక భవన నిర్మాణపనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి యంత్ర పరికరాలు ఇతర వసతులు దాదాపుగా పూర్తయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 11వ తేదీన ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.
బర్డ్
– బర్డ్ ఆసుపత్రికి దాతలు కోట్లాది రూపాయల విలువైన పరికరాలు విరాళంగా అందించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు, ఆర్థోపెడిక్ డాక్టర్లు స్వచ్ఛందంగా విజిటింగ్ కన్సల్టెంట్లుగా ఓపిలు, అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కృతజ్ఞతలు.
– టిటిడి ముద్రించిన 2022 – డైరీలు, క్యాలెండర్లను బ్రహ్మోత్సవాలలో తిరుమల, తిరుపతిలలోని అన్ని టిటిడి ప్రచురణల విక్రయశాలల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతాం.
సర్వదర్శనం టోకెన్లు
– భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సెప్టెంబరు 25వ తేదీ నుండి ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల చేశాం.
– శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు ఆర్టిపిసిఆర్ కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
– శ్రీవారి సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో సెప్టెంబరు 13న అగరబత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. వీటికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. డిమాండ్కు తగినంత ఉత్పత్తి పెంచాల్సిన అవసరముందని వారన్నారు.