లక్నో: అక్టోబర్ 9
ప్రీపోల్ సర్వేలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కుమారి మాయావతి డిమాండ్ చేశారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 15 వ వర్ధంతి కాన్షీరాం స్మారక్ స్థల్లో నిర్వహించారు.మీడియా సంస్థల సర్వేలు, ఇతర ఏజెన్సీల సర్వేలను ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషేధించాలని, దీని వల్ల ఎన్నికలు ప్రభావితం కాకుండా ఉంటాయని ఆమె అన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తానని మాయావతి చెప్పారు. ఈ సమావేశంలో మాయావతి మాట్లాడుతూ, దివంగత దళిత నాయకుడు కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో అధికారం మార్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అయితే సర్వేల పేరుతో ప్రజలను ప్రభావితం చేసేలా చూస్తున్నారని మాయావతి పేర్కొన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుని మరోసారి అధికారంలోకి వస్తుందని ఏబీపీ-సీ వోటర్ సర్వేలో తేలింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 15-19 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వేలో వెల్లడించారు. ఈ సర్వే తమకు అనుకూలంగా లేకపోవడంతో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, యూపీ ప్రభుత్వాలు వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీ వెనకబడిపోతున్నదని సర్వేల్లో చెప్పగా.. ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలుసునన్నారు. ఎన్నికల్లో గెలువడం అనేది కొన్ని చిన్నాచితకా పార్టీల పని కాదని, అధికార పక్షానికి తెర వెనుక నుంచి ప్రయోజనం కల్పించే సొంత స్వార్ధంతో ఉన్నాయని మాయావతి.. పార్టీల పేరు ఎత్తకుండా దుయ్యబట్టారు.