పెద్దపల్లి అక్టోబర్ 20
మనం మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఉత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతి ముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని, రామాయణ గ్రంథం ద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్ పేర్కొన్నారు. హిందూ ధర్మ శాస్త్రంలో చాలా ప్రాచీనమైన రామాయణ గ్రంథం రచించిన మహాకవి వాల్మీకి అని, ఆయన జీవితం సైతం మనందరికీ ఆదర్శ ప్రాయం అని అన్నారు. రామాయణం ద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను మహాకవి మనందరికీ బోధించారని అన్నారు. మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని కలెక్టర్ తెలిపారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంలహతో ముడీబడి ఉందని కలెక్టర్ తెలిపారు. రామాయణంలోని పితృవ్యాఖ్య పరిపాలన ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మాట అనే ఆదర్శాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ యువతకు పిలుపునిచ్చారు. మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతి పండుగను ప్రకటించడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి, వాల్మీకి బోయ సంఘ అధ్యక్షులు మహేందర్, సంబంధిత అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.