హైదరాబాద్, నవంబర్ 15,(న్యూస్ పల్స్)
రాష్ట్రంలో రెండ్రోజులు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళ, బుధవారాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.. ఇటు ఐఎండీ కూడా వానలు పడే అవకాశమున్నట్లు హెచ్చరించింది.తెలంగాణలో నేడూ రేపు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలతో రైతన్నలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. బంగాళాఖాతంలో రెండ్రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇది ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి చేరే అవకాశాలున్నాయని వెల్లడించింది. తూర్పు భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది.క్రమంలోనే సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ కూడా హెచ్చరించింది.. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 7 డిగ్రీలు అదనంగా పెరగడంతో రాత్రిపూట చలి తీవ్రత తగ్గింది. రామగుండంలో ఆదివారం తెల్లవారుజామున 25 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. చలికాలంలో రాత్రిపూట ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవ్వడం ఈ నెలలో ఇదే తొలిసారని తెలిపింది. ఇక ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లాలోని వెంకటాపురంలో 3.3, కుమురం భీం జిల్లాలోని రవీంద్రనగర్లో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతన్నలు దిగులు చెందుతున్నారు. తెలంగాణలోని చాలా చోట్ల వరి కోతలు అయిపోయాయి. ఈ క్రమంలోనే ధాన్యాన్ని కొనుగోలుకు సిద్ధంగా ఉంచారు. అయితే ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. తెరిచిన చోట్ల కూడా కొనుగోళ్లు నెమ్మదిగానే సాగుతుండటంతో ధాన్యం రాశుల వద్దే రైతులు అగచాట్లు పడుతున్నారు. మరోవైపు, కొన్నిచోట్ల వరి కోతలు ఇంకా మొదలు కాలేదు.. ఈ నేపథ్యంలోనే వర్షాలతో వడ్లు ఎక్కడ రాలుతాయోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలోని టెన్షన్
అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలతో కోస్తాఆంధ్రా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. తాజాగా మళ్లీ ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5 .8 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి , తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద రాగల 48 గంటలలో మరింత బలపడే అవకాశం ఉంది. ఆ తరువాత పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణం కొనసాగించి నైరుతి బంగాళాఖాతం వద్దనున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ – ఉత్తర తమిళనాడు తీరానికి సుమారు నవంబర్ 18, 20, 21 వ తేదీన చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:
ఉత్తర కోస్తాఆంధ్ర, యానాం: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాయలసీమ: ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.